న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. లాక్డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని.. కోవిడ్-19(కరోనా వైరస్)సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మస్తుతి అసహ్యంగా ఉందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఇందుకు చిన్న పిల్లలు గడ్డి తింటున్నట్లుగా ఉన్న ఫొటోను జత చేశారు. కాగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించిన 36 గంటల్లో.. రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.(కరోనా లాక్డౌన్: ప్రశాంత్ కిషోర్ ట్వీట్)
ఈ క్రమంలో ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక బిహార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. రోజూవారీ కూలీలు, పేదల కోసం బిహార్ ప్రభుత్వం నిధిని కేటాయించాలంటూ గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మరో ట్వీట్లో పేర్కొన్నారు.(బయటికొస్తే కాల్చిపడేస్తా)